మన సమాచార్ - కోటగిరి
వానాకాలం ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ఏర్పాటు చేయాలని, విండో ఆధ్వర్యంలో క్రిమి సంహారక మందుల దుకాణాలను ప్రారంభించాలని కొత్తపల్లి సహకార సంఘ సర్వ సభ్య సమావేశంలో రైతులు తీర్మానించారు. సహకార సంఘ సమావేశం విండో అధ్యక్షులు డాక్టర్ సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక పోవడం వలన ధాన్యాన్ని దళారులకు విక్రయించే అవకాశం ఉంటుందని అన్నారు. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే రైతులు ధాన్యం విక్రయాలలో నష్ట పోయే అవకాశం ఉందని వివరించారు. రైతు రుణ మాఫీపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.
విండో పరిధిలో క్రిమి సంహారక మందుల దుకాణాలను ప్రారంభించాలని కోరారు. దీంతో పంటల సాగులో అవసరమైన క్రిమిసంహారక మందులను తక్కువ ధరలకు రైతులకు అందించే వీలుంటుందని అన్నారు. ఈ మహాజన సభలో కార్యదర్శి కమలేష్ వార్షిక ఆదాయ వ్యయాలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో విండో మాజీ అధ్యక్షులు రవీంద్ర బాబు, దత్తాత్రేయ పటేల్, డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, తుకారాం, దుబాస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.