మన సమాచార్ - బోధన్
ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి భయపెట్టే రాజకీయాలు మానుకోవాలనీ... నియోజకవర్గం అభివృద్ధి పై దృష్టి పెట్టాలని బోధన్ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమేర్ హితవు పలికారు. బిఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ సందర్భంగా బోధన్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా షకీల్ మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలు పక్కన పెట్టి, అభివృద్ధి పై దృష్టి పెట్టకుండా బిఆర్ ఎస్ నాయకుల పై, కార్యకర్తల పై కక్ష సాధింపులకు దిగడం శోచనీయమన్నారు. తన పై సైతం లేని పోనీ కేసులు జోడించి వేధిస్తున్నారని, నా కుమారుడిపై కావాలనే కేసులు పెట్టించి అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తన ఆరోగ్యం బాగులేక నేను బోధన్ కు రాలేక పోయానని చెప్పారు. కానీ కాంగ్రెస్ నాయకులు అనవసర పుకార్లు సృష్టించారని ఆరోపించారు. తన కుటుంబాన్ని మానసికంగా వేధించేందుకు తప్పుడు కేసులు పెట్టీ 300 ల మంది పోలీసులను తన ఇంట్లోకి పంపించారని ఆరోపించారు. చిన్నపిల్లలను, మహిళలను చూడంకుండా ఒక ఉగ్రవాది కంటే ఘోరంగా తనపై ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తూ కేసులు పెడితే తాము భయపడమని, తెలంగాణ ఉద్యమం సమయంలోనే తమపై వందల కేసులు అయ్యాయని గుర్తు చేశారు. 10 సంవత్సరాల బిఆర్ ఎస్ పాలనకు, 18 నెలల కాంగ్రెస్ పాలనను ప్రజలు చూస్తున్నారని, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని అవకాశం ఇస్తే అధ్వాన్నంగా పాలిస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. తమ అధినాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేస్తున్నారని తెలిపారు. 18 నెలలలోనే కాంగ్రెస్ పాలనపై ప్రజలు బేజారయ్యారని అన్నారు. సుదర్శన్ రెడ్డి వైఖరితో కాంగ్రెస్ కార్యకర్తలు సైతం అయోమయంలో ఉన్నారని విమర్శించారు.
రజతోత్సవాలను విజయవంతం చేయాలి..
ఈ నెల 27 వ తేదీన వరంగల్ లోని ఎళ్కతుర్తి లో జరిగే రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఏర్పడిన నాటి నుండి తెలంగాణలో అనేక ఉద్యమాలు చేపడుతూ దేశంలోనే అగ్రగామిగా బిఆర్ఎస్ పార్టీ నిలబడిందని అన్నారు. బోధన్ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు సకాలంలో మహాసభకు తరలి వెళ్లే విధంగా సన్నద్ధం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ నాయకులు గిర్ధవర్ గంగారెడ్డి, రవీందర్ యాదవ్, నరసయ్య, నర్సింగ్ రావు, శ్రీనివాస్, శ్రీరామ్, అశ్వాఖ్, కార్యకర్తలు పాల్గొన్నారు.